26-06-2025 07:04:11 PM
జనగామ (విజయక్రాంతి): గురువారం జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం(Anti-Drug Day) పురస్కరించుకొని చౌరస్తాలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీసీపీ రాజమహేంద్ర నాయక్(DCP Rajamahendra Naik) ఏఎస్పీ పండరి నితిన్ చేతన్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొనగా బస్టాండ్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు.
అనంతరం ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నెహ్రూ చౌక్ మీదుగా కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం జాగృతి పోస్టర్ ని ఆవిష్కరించారు. విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ పై మత్తు పదార్థాల పట్ల విరక్తిని కలిగించేలా వీడియోలను ప్రదర్శించి అవగాహన పరిచారు. డ్రగ్స్ వ్యతిరేక సంతకాల ప్రచారం, డ్రగ్స్ కు నో జీవితానికి ఎస్ అనే నినాదం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్ రహిత సమాజం కొరకు ఉద్యమంలా పోరాడాలని, ప్రతి విద్యార్థి యుద్ధ సైనికుడుగా సమరం సాగించాలని పిలుపునిచ్చారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమాచారం అందించుటలో ప్రతి ఒక్కరు సహకారం అవసరమన్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలను తెల్ల కాగితంపై రాసి పోస్ట్ బాక్స్ లో వేయాలన్నారు. అలాగే ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు కూడా ఇస్తామన్నారు.
అందుచేత డ్రగ్స్ వినియోగ ప్రాంతాలైన బస్టాండ్ రైల్వే స్టేషన్స్ వంటి ప్రాంతాల్లో యువత నిఘా పెంచి అరికట్టేందుకు సహకరించాలన్నారు. అదేవిధంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణలో పోలీసు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు, పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్ పై అవగాహన పొందాలని తద్వారా డ్రగ్ రహిత సమాజాన్ని చూడగలుగుతామన్నారు. విద్యార్థుల అవగాహన కొరకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. తదనంతరం గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజయ్య, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ అధికారిని ఫ్లోరెన్స్, జిల్లా వైద్య శాఖ అధికారి మల్లికార్జునరావు, పోలీస్ శాఖ అధికారులు, సైకాలజిస్టులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.