04-06-2025 12:10:13 AM
రెస్క్యూటీం, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శవాల వెలికితీత
నిజాంసాగర్, జూన్ 3,(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని పిప్పి ర్యాగాడి తాండ సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో సోమవారం సాయంత్రం ముగ్గురు యువకులు గల్లంతైనారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్ గ్రామ శివారులో క్రికెట్ ఆడిన పదిమంది యువకులు ఎండ వేడిమిని భరించలేక నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో స్నానానికి దిగారని వారిలో ముగ్గురు యువకులు లోతులకు వెళ్లడంతో నీట మునిగిపోయిన విషయాన్ని మిగతా యువకులు గ్రామస్తులకు సమాచారం అందించారు.
గల్లంతైన ముగ్గురిని వెతికేందుకు గజ ఈతగాలతో వెతికించి ముగ్గురి యువకుల మృతదేహాలను మంగళవారం బయటకు తీసి పంచనామా నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. మృతుల్లో ఎల్లారెడ్డి మండలం సోమరిపేట గ్రామానికి చెందిన బెస్థా హర్షవర్ధన్ (17) ఇంటర్మీడియట్ విద్యార్థి, ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ (25), ఎల్లారెడ్డి కి చెందిన మధుకర్ గౌడ్ ( 17) వున్నారు.సెలవులు కావడంతో విహారానికి వచ్చి స్నానాలు చేస్తుండగా ఒకరిని చూసి మరొకరు రక్షించేందుకు వెళ్లి గల్లంతయినట్లు స్థానికులు చెప్తున్నారు.
స్నేహితులతో ఆనందంగా గడపడానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి స్నేహితుల్లో కుటుంబసభ్యుల్లో విషాదం మిగిలింది. నిజాంసాగర్ ఎస్త్స్ర శివకుమార్ సోమవారం సాయంత్రం నుండి ప్రత్యేక చొరవ తీసుకొని మృత దేహాలను బయటకు తీయించే ఏర్పాట్లు చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు సరదా కోసం వచ్చి నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో గల్లంతయి ప్రాణాలు కోల్పోవడం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.