24-06-2025 01:13:04 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూన్ 23 (విజయ క్రాంతి): ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో డయేరియా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో జింక్ కార్నర్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమానంతరం ‘స్టాప్ డయేరియా‘ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సం దర్భంగా మాట్లాడుతూ జులై 31 వరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా క్యాంపియన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లలలో అస్వస్థతను తగ్గించడానికి, డయేరియా నిర్మూలనకు, శిశు మరణాలు సంభవించకుండా చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
అనంతరం ఈనెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తా నాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డిటిడిఓ పవన్ కుమార్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 263 దరఖాస్తులు
సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 263 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆర్జీల సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులనుఆదేశించారు.