‘సర్’ పనులపై జోనల్ కమిషనర్ సమీక్ష
- ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
- ధృవీకరణ ప్రక్రియ పరిశీలన
- గడువులోగా పూర్తి చేయాలని బీఎల్ఓలకు ఆదేశాలు
నాగోల్, జూలై 9 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్-2026)లో భాగంగా నాగోల్లోని విజయ గార్డెన్ కాలనీలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ధృవీకరణ కార్యక్రమాలను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీ వికాస్ మహాతో (జెడ్సీ) గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పురోగతితో పాటు ఇంటింటి ధృవీకరణ ప్రక్రియను సమీక్షించారు.
బీఎల్ఓ సూపర్వైజర్లు, బీఎల్ఓలకు ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఫారాలను సరైన విధంగా ఎలా నింపాలో ఓటర్లు, కాలనీవాసులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి ఇంటిని సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు జోనల్ కమిషనర్ ఆదేశించారు.






