పేదల పక్షాన పోరాడిన వీర వనిత
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె..
ములకలపల్లి (విజయక్రాంతి): భూస్వాముల అన్యాయానికి ఎదురు నిలబడి పేదల పక్షాన పోరాడిన వీర వనితగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) పేర్కొన్నారు. బుధవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గండుగులపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన గొప్ప ఉద్యమకారిణి అని అన్నారు. పేద కుటుంబానికి చెందిన ఆమె న్యాయం కోసం భూస్వాముల అన్యాయానికి ఎదురు నిలబడి రైతాంగానికి ధైర్యం నూరిపోసిన మహిళగా చరిత్రలో నిలిచారన్నారు. తనంతట తాను కూలి పని చేస్తూనే పేద కుటుంబాల బాధలు తనవిగా భావించి అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపిన త్యాగం, ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు.
భూస్వాముల అణచివేతకు లోనుకాకుండా సాధారణ మహిళ కూడా సమాజంలో మార్పు తీసుకురాగలదని తన జీవితంతో నిరూపించిన మహిళగా చాకలి ఐలమ్మ పోరాట పటిమను ప్రదర్శించారని తెలిపారు. ఆమె నిర్వహించిన పోరాటం వలనే గ్రామీణ ప్రజలకు వారి భూమిపై హక్కులు దక్కాయని,అణగారిన వర్గాలకు గౌరవం లభించిందని, మహిళల శక్తి ఏ స్థాయిలో మార్పు తీసుకురాగలదో ఆమె చూపిన మార్గమే నేటికీ అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. నేటి యువత,మహిళలు ఐలమ్మ జీవితం, ఆమె సేవలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధి కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ములకలపల్లి, అశ్వా రావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






