భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలి
రూ.లక్ష కోట్ల భూమిని ఎలాంటి రుసుం లేకుండా ఐడీఎల్కు ధారాదత్తం
బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతల శ్రీనివాస్ రెడ్డి
ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూకట్పల్లిలోని రంగనాయక స్వామి దేవాలయం సమీపంలోని లక్ష కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని ఎలాంటి రుసుం చెల్లించకుండా ఐడీఎల్ కంపెనీకి అప్పనంగా ధారదత్తం చేసిందని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యలు చింతల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
ఈ భూ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెలికి, ఆ భూమిని స్వాధీనపరచుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హై కోర్ట్ సీనియర్ న్యాయవాది పాశం కృష్ణారెడ్డి, శ్రీనివాస చారిలతో కలిసి ఆయన మాట్లాడారు.
కూకట్ పల్లిలో సర్వే నెంబర్స్ 627, 629, 1011/1, 1011/2, 1011/3, 1011/4, 1011/12 డినోనేటర్ లిమిటెడ్ (ఐడీఎల్) ప్రస్తుతం గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జీవోసీఎల్) కంపెనీకి 2021లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ వెయ్యి రూపాయలకు 128 ఎకరాల భూమిని సదురు కంపెనీకి సేల్ సర్టిఫికెట్ ఇచ్చారని వివరించారు.
ఈ సేల్ సర్టిఫికెట్ ఆధారం చేసుకుని జీవోసీల్ కంపెనీ స్క్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీకి 27 ఎకరాల 24 గుంటలు, ఇందూజ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ 32 ఎకరాలు, యాగ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లకు 5 ఎకరాల 24 గంటలు విక్రయించిందని ఆయన వెల్లడించారు. అదే విధంగా సెప్టెంబర్ 2023లో 333 ఎకరాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ అమోయ్ కుమార్ ఎలాంటి రుసుం లేకుండా.. ఆ కంపెనీలకు ధారాదత్తం చేశారని తెలిపారు.
ఈ సర్వే నంబర్స్ అనుకొని 700 ఎకరాలు రిజర్వు ఫారెస్ట్ భూమి ఉందని, ఆ భూమి మొత్తాన్ని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ కబ్జా చేసి బహుళ అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు.ఈ విషయంపై లోకాయుక్తలో కేసు వేశానని, సీసీఎల్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఈ భూ కుంభకోణంలో పాలు పంచుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.






