హోటల్లో అగ్నిప్రమాదం
- ఏడుగురి సజీవ దహనం
12 మందికి తీవ్రగాయాలు
దక్షిణ కొరియాలో ఘటన
సియోల్, ఆగస్టు 23: దక్షిణ కొరియాలోని ఓ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 12 మంది గాయపడ్డారు. బుచియోన్లోని ఓ హోటల్ ఎనిమిదో అంతస్థులో గురువారం రాత్రి షార్ట్సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఏడుగురు సజీవ దహనం కాగా, మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలైన 12 మంది క్షతగాత్రులను రక్షించారు. వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చూశారు. జూన్లో ఓ లిథియం బ్యాటరీ ప్లాంట్లోనూ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో 23 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన అగ్నిప్రమాదాల్లో ఇది రెండోది.






