23-12-2025 12:00:00 AM
చర్ల, డిసెంబర్ 22: ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దాచిపెట్టిన భారీ సుక్మా జిల్లాలోని మీనట్ట అడవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్, జిల్లా పోలీసులు చేపట్టిన జాయింట్ కూంబింగ్ ఆపరేషన్లో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని కూడా గుర్తించి ధ్వంసం చేశారు.
మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన జవాన్లు, మీనాగట్ట అడవుల్లో భూమిలో పాతిపెట్టిన పేలుడు పదార్థాలను, ఆయుధాలను వెలికితీశారు.సరిహద్దు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ విధ్వంసానికి ప్రణాళిక చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసు దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ తనిఖీల్లో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని, ప్రదేశంలో మావోయిస్టులు నిల్వ చేసిన భారీ ఆయుధ గిడ్డంగిని గుర్తించారు. ఆయుధ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న వాటిలో భారీ ఎత్తున ఐఈడీ పేలుడు పదార్థాలు, వైర్లు, డిటోనేటర్లు, మందుగుండు సామగ్రి, కొన్ని దేశవాళీ తుపాకులు ఉన్నాయి.
అందులో 8 సింగల్ షాట్ రైఫిల్స్, 12 బోర్ కార్ట్రిడ్జ్లు 15, ఎలక్ట్రిక్ డెటోనేటర్లు ౫, కార్డెక్స వైర్ 30 మీటర్లు, మల్టీ మీటర్ 1, సేఫ్టీ ఫ్యూజ్ 30 మీటర్లు, పీఈకే పేలుడు పదార్థం ౨ కిలోలు, ఏఎన్ఎఫ్ఓ పేలుడు పదార్థం 1 కిలో, అమ్మోనియం నైట్రేట్ 10 కిలోలు, వైర్లెస్ వీహెచ్ఎఫ్ సెట్లు 8, ఒక వెల్డింగ్ మెషన్, ఒక కట్టర్ మెషిన్, మావోయిస్టుల యూనిఫామ్స్, యూనిఫాం, సింగల్ షాట్ రైఫిల్ ఫ్యాక్టరీకి అవసరమైన భారీమొత్తంలో ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.