02-06-2025 10:56:07 PM
చారకొండ: మండలంలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి మర్రిపల్లి సమీపంలో పెట్రోల్ లేక తోసుకుంటూ ముందు వెళుతున్న బైకును వెనుక నుండి ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై షంషుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... దేవరకొండ మండలం ఎల్లారెడ్డి బావి గేటు చెందిన మామిళ్ళ ముత్తయ్య(40) తన ఇంటి నుంచి చారకొండకు బైక్ పై వస్తుండగా మార్గమధ్యలో మర్రిపల్లి సమీపంలో ముందుగా వెళుతున్న డిండి మండలం వావిల్ కోల్ గ్రామానికి చెందిన చిన్నయ్య తన బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్కనే బైకును నెట్టుకుంటూ వెళుతున్న క్రమంలో వెనుక నుండి ముత్తయ్య బైకును ఢీకొట్టాడు. దీంతో ముత్తయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.