ప్రమాదాల నివారణ కోసమే ఏడుపాయల్లో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు
ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి...
పాపన్నపేట: ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధానం వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను ఔట్ పోస్టు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రఖ్యాతి గాంచిన ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మెదక్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టేటప్పుడు ఏడుపాయలలోప్రతినెల ఇద్దరు ముగ్గురు నదిలో పడి మృతి చెందిన సంఘటన తమ దృష్టికి వచ్చి కలత చెందానన్నారు. అప్పటినుండి తమ దృష్టాంత ప్రాజెక్టు నీటి ప్రమాదాల మీది కేంద్రీకరించి ప్రమాద నివారణకోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. అప్పటినుంచి ప్రమాదాల సంఖ్యను 90% నివారించగలిగామన్నారు.
డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు అన్న ఉద్దేశంతో ఏడుపాయలలో అవుట్ పోస్టును మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏదైనా సంఘటన జరిగితే పాపన్నపేట నుండి పోలీసులు ఏడుపాయలకు రావాలంటే 20 కిలోమీటర్లు రావాల్సి ఉంటుందని, జరగరాని సంఘటన జరిగాక వారు సంఘటన ప్రదేశానికి చేరుకుంటారని తెలిపారు. ఇక ముందు అలా జరగకూడదన్న ఉద్దేశంతో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ఏడుపాయలలో ప్రమాదల నివారణ కోసం బోటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా గతంలో ఆలయ ఈవోకు చెప్పినప్పటికీ ఆయన కనీసం పట్టించుకోలేదని, ఇప్పటికైనా బోటింగ్ ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు. ఇకనుండి అవుట్ పోస్టులో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ తో పాటు నలుగురు పోలీసులు ఉంటారన్నారు. వీరి వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ రెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్, కొల్చారం ఎస్ఐ గౌస్, ఏడుపాయల ఈవో చంద్రశేఖర్ తదితరులున్నారు.




