20-12-2025 01:05:33 AM
రౌడీషీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్
రాజేంద్ర నగర్ డిసెంబర్ 19, (విజయ క్రాంతి ): రౌడీ షీటర్లు నేరప్రవృత్తిని వదిలి ఎదో ఒక ఉపాధి రంగాల్లో స్థిరపడి సమాజం లో గౌరవం గా బతకాలని రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయంలో అత్తాపూర్, నార్సింగీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ-షీటర్ల (నేరస్థుల) కదలికలను పోలీసులు ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటారని, ఈ విషయాన్ని రౌడీ షీటర్ లందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. వారి సహచరులు మరియు పరిచయస్తులతో మాట్లాడారు.
రౌడీ షీటర్లు బెయిల్ షరతులను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలో తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఏ మాత్రం కుదరదన్నారు. తమ దృష్టిని నేరాల వైపు మళ్ళిస్తే ఎంతో అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. ప్రధానంగా అర్థరాత్రి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలని హెచ్చరించారు. రౌడీ షీటర్లు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు చేయబడుతుందని స్పష్టం చేశారు. దీని ఫలితంగా జ్యుడీషియల్ కస్టడీకి, ( కటకటాల్లోకి ) పంపడం జరుగుతుందన్నారు.
ఇప్పటికైనా నేరస్తులు తమ నేల ప్రవృత్తిని వదిలేసి తమ కుటుంబాల సంక్షేమం కోసం వివిధ ఉపాధి రంగాల్లో స్థిరపడాలని సూచించారు. సమాజంలో మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ తమ జీవితాన్ని సన్మార్గంలో నడవాలని తెలిపారు. పాత నేరస్తులు ఎవరైనా సరే మళ్లీ మళ్లీ తప్పు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. మెరుగైన సమాజం కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు పాటుపడాలని కోరారు. ఈ సమావేశంలో అత్తాపూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, నార్సింగీ ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.