28 July, 2026 | 2:23 AM

అబ్దుల్ కలాం జీవితం యువతకు స్ఫూర్తిదాయకం

28-07-2026 01:40 AM

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు, జూలై 27 : అత్యంత సామాన్య కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి.. భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టడంతో పాటు రక్షణ రంగంలో మిస్త్స్రల్ మెన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గల అబ్దుల్ కలాం కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమున్నత లక్ష్యంతో  ప్రత్యేకంగా కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలోనే ఆయన కాంస్య విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ప్రతిరోజు ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నేటితరం విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాలను తరిమికొట్టాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి లోకంపైన ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, అశోక్, పృథ్వీరాజ్, వెంకటేష్, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.