26-01-2026 02:11:21 AM
వన్డే సిరీస్ పరాభవానికి అసలు సిసలు ప్రతీకారం.. టీ20 ప్రపంచకప్కు ముందు అదిరిపోయే సిరీస్ విజయం.. కీలక ఆటగాళ్లు ఫామ్ అందుకున్న వేళ.. అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగించినవేళ.. సూర్యకుమార్ మరో ఫిఫ్టీ కొట్టిన వేళ.. ఇంకేముంది కివీస్పై టీ20 సిరీస్ మనదే..ఈ నెంబర్ వన్ బ్యాటర్ గుహావటీలోనూ డైనమైట్లా పేలాడు. కేవలం 14 బంతుల్లోనే ఫిఫ్ఠీ బాదేశాడు. ఫలితంగా వార్ వన్ సైడ్ అయిపోయింది. అంతేకాదు మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది.
గుహావటి, జనవరి 25 : సిరీస్ విజయమే లక్ష్యంగా ఈ మ్యాచ్లో భారత్ రెం డు మార్పులు చేసింది. బుమ్రా జట్టులోకి తిరిగి రాగా, రవి బిష్ణోయ్ కూడా చోటు దక్కించుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆ జట్టు ఆరంభంలోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. కాన్వే (1), రచిన్ రవీంద్ర(4), స్టిఫర్ట్(12) పరుగులకే వెనుదిరిగారు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ , చాప్మన్ కాసేపు పోరాడడంతో కోలుకుంది. ఫిలిప్స్ 40 బంతుల్లోనే 48( 5 ఫోర్లు, 1 సిక్స్) , చాప్మన్ 23 బంతుల్లో 32 (2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో రాణించారు.
చివర్లో మిఛెల్ శాంట్నర్ మెరుపులతో కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. బుమ్రా తన స్పెల్ లో కేవలం 17 పరుగులే ఇట్టి 3 కీలక వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ 2, పాండ్యా, 2 ,రాణా 1 వికెట్ తీసాడు. ఇదిలా ఉంటే ఛేజింగ్లో తొలి బంతికే భారత్కు షాక్ తలిగింది. సంజూ శాంసన్ డకౌటై మరోసారి నిరాశపరిచాడు. ఇప్పటి వరకూ జరిగిన మూడు వన్డేల్లోనూ సంజూ ఫెయిలయ్యాడు.
బ్యాటింగ్ పిచ్పై పరుగులు చేయలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్ కు 53 పరుగులు జోడించాడు. ఇషాన్ కిషన్ 28 పరుగులకు ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ కివీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఈ యువ ఓపెనర్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
తద్వారా పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అటు సూర్యకుమార్ యాదవ్ కూడా తన ఫామ్ కొనసాగించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్ను ఫినిష్ చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో భారత్ 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. అలాగే ఈ గెలుపుతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.
ఈ క్రమంలో పలు రికార్డులను కూడా సొంతం చేసుకుంది. సొంతగడ్డపై అత్యధిక సిరీస్లు గెలుచుకున్న రికార్డును సొంతం చేసుకుంది. 2022 నుంచి ఇప్పటి వరకూ భారత్ సొంతగడ్డపై 10 సిరీస్లు గెలిచింది. అలాగే 2024 నుంచి ఇప్పటి వరకూ 11 సిరీస్లు గెలవడం ద్వారా సక్సెస్ఫుల్ రికార్డు ట్రాక్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ విశాఖపట్నంలో జనవరి 28న జరుగుతుంది.
స్కోరు బోర్డు:
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 153/9 ( ఫిలిప్స్ 48, చాప్మన్ 32, శాంట్నర్ 27; బుమ్రా 3/17, రవిబిష్ణోయ్ 2/18, హార్థిక్ పాండ్యా 2/23)
భారత్ ఇన్నింగ్స్ 154/3 (10 ఓవర్లు)( అభిషేక్ శర్మ 68, సూర్యకుమార్ 57 నాటౌట్, ఇషాన్ కిషన్ 28 ; హెన్రీ 1/28, నోధి 1/28)