09-09-2025 03:27:19 PM
రూ.4 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
ప్లాట్ ఎల్ఆర్ఎస్ కోసం రూ.10 లక్షలు డిమాండ్
కొనసాగుతున్న సోదాలు
మణికొండ: లంచం తీసుకున్న పాపానికి నార్శింగి మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి అధికారిణి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. టౌన్ ప్లానింగ్ అధికారిణి (టీపీఎస్) మణిహారిక రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం నార్శింగి మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, మంచిరేవుల ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన ప్లాట్ కు సంబంధించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (Layout Regularization Scheme) క్లియరెన్స్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారికను సంప్రదించాడు. ఫైల్ క్లియర్ చేయడానికి ఆమె ఏకంగా రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. లంచం ఇవ్వనిదే పని జరగదని తేలడంతో, వినోద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు, అంగీకరించిన లంచంలో మొదటి విడతగా రూ.4 లక్షలను మంగళవారం మణిహారికకు కార్యాలయంలోనే ఇస్తుండగా, ముందుగానే మాటు వేసిన ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. టౌన్ ప్లానింగ్ అధికారిణి పట్టుబడటంతో మున్సిపల్ కార్యాలయంలోని ఇతర అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, కార్యాలయంలోని ఆమె ఛాంబర్ లో, సంబంధిత దస్త్రాలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఈమెకు సంబంధించి మరిన్ని ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.