07-02-2026 05:27:45 PM
మానకొండూరు,(విజయక్రాంతి): మానకొండూరు మండలంలోని ఉపసర్పంచ్ లకు ఆయా గ్రామ పంచాయతీలలో సర్పంచులతో పాటు సమానంగా ప్రత్యేక గది లేదా చాంబర్ ఎర్పాటు చేయాలని మానకొండూరు మండల ఉప సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో మూకుమ్మడిగా ఉపసర్పంచ్ లు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీలలో ప్రత్యేక కుర్చీ కేటాయించాలని, ఇందుకుగాను కార్యదర్శులకు సూచనలు ఇచ్చి తగురీతిగా హోదా, గౌరవం కల్పించాలని మండల పరిషత్తు అభివృద్ధి అధికారికి ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
శనివారం మానకొండూరులోని వేడుక మందిరంలో ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గడ్డి గణేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉప సర్పంచ్ ల సంక్షేమం కోసం ప్రతి ఉపసర్పంచ్ కు ఎలాంటి పూచికత్తు లేకుండా 20 లక్షల వరకు రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉపసర్పంచ్ కు ₹25 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని కోరారు. మండలంలోని గ్రామాల ఉపసర్పంచ్ తో పాటు ఫోరం ప్రధాన కార్యదర్శి రాపాక ప్రవీణ్, ఉపాధ్యక్షులు మర్రి కుమారస్వామి, ఇడుముల సంపత్, ఈ సమావేశానికి హాజరయ్యారు.