తెలంగాణ క్రీడా పాఠశాలలో నాలుగవ తరగతి ప్రవేశాల ప్రక్రియ
కొత్తగూడెం, మార్చి 31, (విజయక్రాంతి ): కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో మంగళవారం తెలంగాణ క్రీడా పాఠశాలలో, నాలుగవ తరగతి ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపిక పరీక్షలను నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు పలు శారీరక దృఢత్వం, నైపుణ్యాల ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎత్తు, బరువు కొలతలతో పాటు 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 6స10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల పరుగు పందెం, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ తదితర విభాగాలలో పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన మొదటి పది స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులను ఎంపిక చేసి, మొత్తం 20 మందిని వచ్చే నెల సికింద్రాబాద్ హకీంపేటలో గల,రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలో జరిగే తుది ఎంపికలకు పంపించనున్నట్లు జిల్లా క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.జి.ఎఫ్ నరేష్, కోచ్ మల్లికార్జున్, మంగీలాల్, స్టెల్లా, వేణుగోపాల్, యుగంధర్, సురేఖ తదితరులు పాల్గొన్నారు.




