ఆలె నరేంద్రది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం
- రామరాజ్యం స్థాపించే వరకు పోరాటం ఆగదు
- ‘ఆలె’ వర్థంతి కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఆలె నరేంద్ర ధర్మం కోసమే కాదు, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కూడా పోరాడార ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అన్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీ పెట్టి, ఉద్యమాన్ని ముందుండి నడిపిన యోధుడని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చూపిన పోరాట పటిమ అందరిలో నిండాలని, రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై ‘రామరాజ్యం’ స్థాపించే వరకు మన పోరాటం ఆగదన్నారు.
దివంగత నేత ఆలె నరేంద్ర 12వ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా బీజేపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం రాంచందర్రావు మాట్లాడుతూ భాగ్యనగర హిందూ గుండె చప్పుడు.. టైగర్, అన్యాయంపై ఎగిసిన పిడికిలి అని, హిందూ ధర్మ రక్షణ కోసం కదం తొక్కిన ధైర్యం ఆలె నరేంద్ర అని కొనియాడారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎంను రెచ్చగొడుతూ పాతబస్తీలో హిందువుల మీద దాడులు జరుగుతుంటే ‘నేనున్నానంటూ’ గర్జించిన ఏకైక నాయకుడు నరేంద్ర అన్నారు.
మతకల్లోలాల సమయంలో ప్రాణాలకు తెగించి, మజ్లిస్ గూండాల దాడులను ఎదుర్కొని, హిందువుల మానప్రాణాలను ఆయన రక్షించారన్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో కాషాయ జెండా రెపరెపలాడుతోందంటే, వేలాది మంది కార్యకర్తలు ధైర్యంగా పని చేస్తున్నారంటే అది నరేంద్ర ఇచ్చిన స్ఫూర్తి అన్నారు. పదవుల కంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన నిజాయితీ గల నాయకుడు నరేంద్ర అన్నారు.
కార్మికుల పాలిట పెన్నిది, కాగజ్నగర్ మిల్స్ దగ్గర నుంచి హైదరాబాద్లోని అల్విన్ కంపెనీ వరకు అనేక పరిశ్రమల్లో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా కార్మికుల హక్కుల కోసం అహోరా త్రులు ఆయన పోరాడారని రాంచందర్రావు గుర్తు చేశారు. కార్మికుడి చెమట చుక్కకు విలువ కట్టాలని తపించిన నాయకుడని, నరేంద్ర ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దామని రాంచందర్రావు పిలుపునిచ్చారు.




