వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్డీఆర్ఎఫ్, డిడిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ బుధవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
ముందస్తు చర్యలుగా రక్షక బృందాలను ముంపుకు గురయ్యే ప్రాంతాల సమీపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ , డిడిఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్, చెట్లను తొలగించడానికి కావలసిన కట్టర్లను ఇతర రక్షణ సామాగ్రిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ప్రకృతి వైపరీక్షల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలుగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్, టీజీఎస్పి అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్,ఆపరేషన్ ఆర్ఐ బి. రవి, సింగరేణి రెస్క్యూ టీం ఇంచార్జ్ అనంత రాములు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సుమంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.






