మెడికల్ ఫిట్ అయిన వారసులకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి
కొత్తగూడెం ఏరియా జీఎంబీ కార్యాలయం ఎదుట భారీ ధర్నా.. ముట్టడి నిర్వహించిన ఏఐటీయూసీ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాముట్టడి కార్యక్రమం నిర్వహించారు. నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారసులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు మాట్లాడుతూ, ఉద్యోగంలో ఉన్న సమయంలో అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో కార్మికులు తమ సేవలను కోల్పోయిన సందర్భాల్లో వారి కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగ విధానం అమలులోకి వచ్చిందన్నారు. అయితే మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించి, అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్నప్పటికీ వందలాది మంది వారసులు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోందని, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మిక కుటుంబాల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యాజమాన్యాన్ని కోరారు.సింగరేణి సంస్థ లాభాల సాధనలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి కార్మికుల కుటుంబాలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మెడికల్ ఫిట్ అయిన ప్రతి వారసుడికి ఆలస్యం లేకుండా నియామక పత్రాలు అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిం చారు. అనంతరం నాయకులు జనరల్ మేనేజర్ షాలెం రాజు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు పాల్గొన్నారు.






