calender_icon.png 19 July, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలి

19-07-2025 12:19:42 AM

ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్ 

బెల్లంపల్లి అర్బన్, జూలై 18 :  బెల్లంపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల, బాలుర జూనియర్ కళాశాల (ఇ/మీ) లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేందర్, జాడి పోచయ్య లతో కలిసి తనిఖీ చేశారు.

విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, త్రాగునీరు, వంటశాల, భోజనశాల, వసతి గృహంలో వసతులు, పడకలు, మూత్రశాలలు, గదులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని, బడి బయట పిల్లలు, మధ్య బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.

6, 7 తరగతుల విద్యార్థులతో మాట్లాడి వారి పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న పోషక ఆహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

అభివృద్ధి పనుల తనిఖీ... 

అమృత్ 2.0 పథకంలో భాగంగా కొనసాగుతున్న నీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మిషన్ భగీరథతో పాటు అమృత్ 2.0 పథకం క్రింద నివాసాలకు త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, మండల విద్యాధికారి పోచయ్య, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.