10-10-2025 10:31:35 PM
బిసి రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయి
బీసీ విద్యార్థి,సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు.
నీల నాగరాజు, సాప శివరాములు డిమాండ్
కామారెడ్డి,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు ఆరోపించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో బిసి రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాల్ ఆవరణలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహము నుండి ర్యాలీగా బయలుదేరి నిజాంసాగర్ చౌరస్తా వద్ద బిసి రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందన్నారు.
అనంతరం నిజాం సాగర్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావు అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయి అని పేర్కొన్నారు. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెపం నెట్టడమే తప్ప బీసీలకు నిజమైన మద్దతు ఇవ్వడం లేదన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కింది నుంచి పై కోర్టుల వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి కోర్టులను వేదికగా చేసుకుని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని అన్నారు, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని రాష్ట్ర గవర్నర్ ఆమోదించి ఉంటే రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై స్టే వచ్చే అవకాశం లేదని ఇదే విషయం హైకోర్టులో జరిగిన వాదన సందర్భంగా అసెంబ్లీలో చేసిన చట్టానికి గవర్నర్ ఆమోదం ఉందా అని రాష్ట్ర హైకోర్టు పదేపదే ప్రశ్నించింది అని ఒకవేళ గవర్నర్ గారి ఆమోదం కనుక ఉంటే ఈరోజు రాష్ట్ర హైకోర్టులో స్టే వచ్చేది కాదని అన్నారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి దక్కడానికి మొదటి నుండి బీసీ సమాజమంతా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ బిజెపి నేతలు బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పదేపదే బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించారాని, బిజెపి నేతలు రాష్ట్ర గవర్నర్ను కలిసి ఉంటే గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకునే వారనీ, బిజెపి ఇదేమి చేయకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అనడం సిగ్గుచేటు అన్నారు
బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఒక పార్టీపై ఇంకొక పార్టీ నెట్టు వేసుకుంటూ బీసీలను బలి పశువులు చేశారని వారు మండిపడ్డారు. అగ్రవర్ణాలు ఎలాంటి పోరాటాలు చేయకున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రబుత్వం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని మండి పడ్డారు.రాబోవు రోజుల్లో బీసీ రిజర్వేషన్లే ధ్యేయంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.