ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం
31 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 1994-95వ సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని 31 సంవత్సరాల తర్వాత చందుర్తి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... అలనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాల నుండి కార్యక్రమానికి తరలివచ్చి అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. డాన్స్ చేస్తూ ఆట పాటలతో ఆనందంగా గడిపారు.
హాజరైన ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థులకు జ్ఞాపిక అందించి శాలువాతో ప్రతి ఒక్కరిని సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన అలనాటి ఉపాధ్యాయులు బండ లింగారెడ్డి, పి.సుధాకర్, సిహెచ్ ప్రభాకర్, ఐ.ప్రభాకర్ లు తమ అమూల్యమైన సందేశాన్ని పూర్వ విద్యార్థులకు ఇచ్చారు. ఉపాధ్యాయులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ... కేవలం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకొని మరిచిపోకుండా ఇదే ఐకమత్యాన్ని జీవితాంతం కొనసాగించాలి.
స్నేహ బంధాన్ని మించిన బంధం ప్రపంచంలో మరేది లేదని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుపుకొని మరిచిపోకుండా జీవితాంతం ఇలాగే ఐకమత్యంగా ఉండాలని, ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకోవాలని తమ స్నేహితులకు అండగా నిలవాలన్నారు. పూర్వ విద్యార్థి కట్కూరి ముఖేష్ మాట్లాడుతూ కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ముందుండి నడిపించిన బండ శంకర్, నేరెళ్ల బాబు, మల్యాల దేవరాజు, మ్యాకల కొమురయ్య, గుర్రం మధు, నయీమ్ పాషా లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.






