శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి
ఘన స్వాగతం పలికిన దేవాదాయ కమిషనర్, ఈవో
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం, 2:30 నిమిషాలకు యాదగిరిగుట్ట దేవస్థానం కు చేరుకున్న ఆయనకు దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవాని శంకర్,అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు అర్చక బృందం ఘనంగా స్వాగతం పలికారు.
కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి అనుబంధ ఆలయం అయినా పర్వతవార్డుని రామలింగేశ్వర ఆలయంలో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు. స్పటిక లింగమునకు ,స్వయంభు లింగానికి అభిషేకం చేశారు. అనంతరం కళా వేదిక వద్ద భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులతో చతుర్వేద పారాయణం అనంతరం విజయేంద్ర సరస్వతి భక్తులకు ఉద్దేశించి ప్రసంగించారు.
శనివారం ఉదయం దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. యాదగిరిగుట్ట లోని టెంపుల్ సిటీ నందు 15 ఎకరాలలో వేద పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపనలో పాల్గొంటారు. కళ్యాణమంటపం, దీక్షాపరుల సదనం ఇతర కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు,వేద పండితులు భక్తులు పాల్గొన్నారు.






