సామాజిక న్యాయానికి మార్గదర్శి అంబేద్కర్
పీసీసీ చీఫ్ మహేష్కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి మార్గదర్శి అయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్కుమార్గౌడ్ ఘన నివాళులు అర్పించారు. కోట్లాది పీడిత, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగునింపిన మహానేత అని కొనియాడారు.
సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను భారత సమాజానికి అందించిన గొప్ప దార్శనికుడిగా అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, రాజ్యాంగ రూపకల్పనలో కృషి అపారమని, ప్రతి భారతీయుడు గౌరవించే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయనే పునాది వేశారని మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు.
విద్యా, హక్కులు, అవకాశాల్లో సమానత్వం సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు అంబేద్కర్ మహోన్నత సేవలను మరొకసారి గుర్తు చేస్తున్నాయని, యువత ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.




