29-06-2025 04:58:27 PM
నిజామాబాద్: నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల(Nizamabad Polytechnic College) మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభ(Farmers' Association Meeting)లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందని, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ విజయం ఖాయమైనట్లు తెలుస్తోందని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ కు ఎంపీ అర్వింద్(MP Arvind) పసుపు బోర్డు సాధించారని, పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నామని అమిత్ షా హామీ ఇచ్చారు.
నిజామాబాద్ రైతులు పసుపు బోర్డు కోసం 40 ఏళ్లు పోరాటం చేశారని, ఇప్పుడు వారి కలను మోదీ సాకారం చేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారని మంత్రి గుర్తు చేశారు.నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్ లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందని, పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్ భారత్ ఎక్స్ పోర్టు లిమిటెడ్ కూడా నిజామాబాద్ లోనే ఏర్పాటవుతున్నాయి.
భారత్ ఎక్స్ పోర్టు లిమిటెడ్ తో నిజామాబాద్ పసుపు అమోరికా, యూరప్ దేశాలతో పాటు భవిష్యత్ లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందని అమిత్ షా చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్ మనల్ని భయపెట్టాలని చూసిందని, ఆ తర్వాత భారత్ శక్తి ఏమిటో పాకిస్థాన్ కు, ప్రపంచానికి తెలిసిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలో నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని వెల్లడించారు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా.. మీరే చెప్పండి అని నిజామాబాద్ ప్రజలను అడిగారు. 2026 మార్చి 30లోపు దేశంలో నక్సరిజం అనేదే లేకుండా చేస్తామన్నారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోయి, తర్వగా జన జీవన స్రవంతిలోకి రావాలని అమిత్ షా సూచించారు.
ఇప్పటికే 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని, జనజీవ స్రవంతిలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. గత పదేళ్లలో బీజేపీ సర్కార్ అవినీతికి పాల్పడిందా లేదా..? అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్, కాళేశ్వరం.. ఇలా అనేక అంశాల్లో బీఆర్ఎస్ సర్కార్ అవినితీకి పాల్పడిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని, తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది.. కానీ అవినీతి పోలేదన్నారు. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో అవినీతి కొనసాగుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యంగ్యంగా మాట్లాడారు.