వెలిమినేడు శివారులో గోవధ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్
చిట్యాల,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక నార్లగుట్ట సమీపంలోని నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున గోవధ చేసి, గోవుల కళేబాలను సిమెంట్ రింగుల్లో భద్రపరిచినట్లు గుర్తించిన ప్రాంతాన్ని చిట్యాల బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ముదిరాజ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటన వెనుక భారీ కుట్ర కోణం ఉండే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు.
గోవధకు పాల్పడిన వారిని గుర్తించి, ఘటన వెనుక ఉన్న పూర్తి నిజానిజాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. ప్రజల్లో ఆందోళన కలిగించే ఇటువంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఘర్ష నరేష్, అనిల్, పున్న విష్ణు, గట్టోజు నరేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.






