సమయపాలన లేక సాగుతున్న అంగన్వాడి
ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, పట్టించుకోని అధికారులు
చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల కేంద్రంలోని అంగన్వాడి-2 కేంద్రం రోజూ సమయానికి ప్రారంభం కాకపోవడంతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడి సమయానికి వచ్చిన చిన్నారులు గంటల తరబడి బయటే వేచి ఉండి, చివరకు నిరాశతో ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంగన్వాడి టీచర్లు సమయపాలన పాటించకపోవడం వల్ల చిన్నారుల విద్యాభ్యాసంపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రామస్థులు అంటున్నారు.
ఇదే సమస్య గతంలో కూడా పలుమార్లు చోటుచేసుకున్నప్పటికీ, ఇప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడం బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సంబంధిత అధికారులు ఈ సమస్యపై స్పందించకుండా “నిమ్మకు నిరత్తినట్టు” వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంగన్వాడి కేంద్రాన్ని సమయానికి ప్రారంభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. “మా రాతలు ఎప్పుడు మారతాయి? మాకు బడి టైం తీయరా మేడం?” అంటూ చిన్నారుల అమాయక ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అంగన్వాడి కేంద్రంలో క్రమశిక్షణ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.




