06-01-2026 12:37:32 PM
మంథని లో గణనాథునికి ఘనంగా పూజలు
మంథని,(విజయక్రాంతి): ప్రతి నెలలో పౌర్ణమితి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు. ముఖ్యంగా మంగళవారం రోజున వచ్చిన చతుర్థి కి అంగారక చతుర్థిగా ఎంతో విశిష్టత కలిగి ఉంది. మంథని పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో అంగారక చతుర్థి వేడుకలు భక్తులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి చంద్రోదయం సమయం వరకు భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులు ఆలయాన్ని శోభాయ మానంగా అలంకరించారు.
శ్రీ గణనాథుని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మంగళవారం గణనాథుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ సంకష్టహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. కొత్తగా చతుర్థి దీక్ష తీసుకునేవారు అంగారక చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయష్కారం. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికమించడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేపట్టడం అనాదిగా పాటిస్తున్న నియమం. సంకష్టహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుని పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేసి మోదకులు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
పుష్య మాసంలో వచ్చిన అంగారక చతుర్థి ఎంతో విశిష్టమైనది. మంథని పట్టణంలోని శ్రీ గణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుతీరి ఉండడం ఎంత విశిష్టత కలిగినది. గణపతికి ఇష్టమైన వారం మంగళవారం అలాగే నవగ్రహాల్లోని కుజ గ్రహ దోషం పోవాలన్న మంగళవారం వచ్చే అంగారక చతుర్థి రోజున "ఓం గం గం గణపతియై నమః " అని స్మరిస్తూ విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటే అన్ని సంకటాలు తొలగిపోతాయి. ఏడాదిలో ఒకసారి మంగళవారం వచ్చే చతుర్థి ని అంగారక అంటారు. ఈ రోజున రాత్రి 9.02 నిమిషములకు చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజ చేసి భోజనం చేయడం ఎంతో శ్రేయష్కారం.
ఈ రోజున ఉపవాస దీక్ష స్వీకరిస్తే జీవితంలో ఎదుర్కొంటున్న విజ్ఞాలన్ని తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవతలలో మొట్టమొదట పూజించబడే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విఘ్నేశ్వరున్ని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి అంతా శుభం జరుగుతుందనే విశ్వాసంతో సంకష్టహర చతుర్థి దీక్షను స్వీకరిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి ఇష్టమైన గరిక ( దూర్వాలు ) సమర్పించడం అలాగే 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రలవుతారు అని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ రోజున చంద్రోదయం అనంతరం భోజనం చేయడం ఈ దీక్షలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలయ పూజారి పల్లి రాము భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.