‘మేడిగడ్డ’ పరిశీలనకు మరో బృందం
ఈఎన్సీ నేతృత్వంలో లక్ష్మి బరాజ్ ఏడోబ్లాక్ పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి, మే27 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మి బరాజ్ను మరో నిపుణుల బృందం పరిశీలించింది. ఈఎన్సీ అనిల్కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యులున్న కమిటీ సోమవారం భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డకు చేరుకుంది. బరాజ్ లోని ఏడో బ్లాక్ ప్రాంతాన్ని పరిశీలించింది. ఆ బ్లాక్లోని గేట్ల కటింగ్, గ్రౌటింగ్ పనులను పర్యవేక్షించారు. అనంతరం డ్యాం అప్ స్ట్రీం, డౌన్ స్ట్రీమ్లో పడ్డ గొయ్యిల సమగ్ర వివరాలు సేకరించారు. వాటిని నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీకి సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ కమిటీలో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ నిపుణులు నాగేందర్రావు, మోహన్, రామగుండం సర్కిల్ చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డి ఉన్నారు.






