26-06-2025 08:17:27 PM
అనంతగిరి: మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్ధులు కలిసి యుద్ధం చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మంగా(ICDS Supervisor Manga), ఎస్సై నవీన్ కుమార్(SI Naveen Kumar) అన్నారు. అనంతగిరి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆద్వర్యంలో యాంటి డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ స్టేషన్, పాఠశాలల పరిధిలో యువతకు, ప్రజలకు డ్రగ్స్ పై వ్యతిరేక అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రధాన కూడలి వద్ద ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా సమాజంలో మాదకద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నదని అన్నారు.
డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయన్నారు. డ్రగ్స్కు, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా జిల్లా ప్రజలు డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడే ఐ యామ్ యాంటి డ్రగ్ సోల్జర్ అంటూ ఫొటో పాయింట్లో ఫొటో దిగి విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు,సిబ్బంది డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక హై స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ సలీమా, ప్రైమరీ ప్రిన్సిపాల్ విప్పర్ల రమేష్,అంగన్వాడి టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.