6 June, 2026 | 1:44 AM

చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తులు

06-06-2026 12:14 AM

సంగారెడ్డి, జూన్ 5 : మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం (ఫాల్ సీజన్2026) కింద అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి  డి.వేంకటేశ్వ రరావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన మైనారిటీ విద్యార్థుల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో 2026 జనవరి 1 నుండి జూన్ 30 మధ్య ప్రవేశం పొందిన అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

అభ్యర్థులు 2026 జూన్ 1 నుండి జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకు వ్బుసైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీతో పాటు అవసరమైన ధృవపత్రాలను 2026 జూలై 31 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, సంగారెడ్డిలో సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు విదేశీ విద్య కోసం గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వన్-వే విమాన ప్రయాణానికి రూ.60,000 వరకు లేదా వాస్తవ వ్యయంలో తక్కువ మొత్తాన్ని ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.

పత్రాల పరిశీలనలో నకిలీ ధృవపత్రాలు సమర్పించినట్లు తేలితే సంబంధిత అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. వయస్సు, విద్యార్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర అర్హతల వివరాల కోసం  వ్బుసైట్ను సందర్శించాలని సూచించారు. జిల్లాకు చెందిన అర్హులైన మైనారిటీ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ముందుకు రావాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కోరారు.