10 April, 2026 | 1:42 AM

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

10-04-2026 12:28 AM

గద్వాల టౌన్, ఏప్రిల్ 9 : శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థలో 2026-27కు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు అర్హత గల బాలికల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నందు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు 2026-27 విద్యా సంవత్సరానికి తల్లిదండ్రుల కోల్పోయిన అనాధ బాలికలు, నిరాశ్రయులు, చైల్ హోమ్స్/మహిళా సంస్థలలో ఉన్న బాలికలు,అక్రమ రవాణాకు గురైన బాధితులు మరియు దివ్యాంగ బాలికలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ సంస్థలో సివిల్,ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్,ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, సెమీకండక్టర్ టెక్నాలజీ,ల్యాండ్స్కేప్ డిజైన్ వంటి డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని,ప్రతి కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 360 సీట్లు ఉన్నాయని చెప్పారు.ఈ మొత్తం సీట్లలో 70% సీట్లు అనాధ మరియు నిరాశ్రయ బాలికలకు కేటాయించబడినట్లు, అలాగే 3% సీట్లు దివ్యాంగులకు కేటాయించినట్లు తెలిపారు.

అర్హతగా కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలని,పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఎంపికైన అభ్యర్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించబడుతుందని తెలిపారు. కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు (అనాధలకు మినహాయింపు), తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం,సంబంధిత సంస్థ నుండి బోనఫైడ్ సర్టిఫికేట్, టీసీ,అధ్యయన ధృవీకరణ పత్రం,పదవ తరగతి మార్కుల మెమో సమర్పించాలన్నారు.

అభ్యర్థులు అవసరమైన ధృవీకరణ పత్రాలతో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను మే 25, 2026లోగా హైదరాబాద్లోని డైరెక్టర్, మహిళాభివృద్ధి&శిశు సంక్షేమ శాఖ #8-3-222, మధురానగర్, సారథి స్టూడియో సమీపంలో, యూసఫ్ గూడ, అమీర్పేట్, హైదరాబాద్ 500038 కార్యాలయానికి పంపించాలని సూచించారు. మరిన్ని వివరాలకు గద్వాల పాత కలెక్టరేట్లోని బాలరక్షా భవన్ను సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.