ఘన వ్యర్థాల నిర్వహణపై మొండికుంట గ్రామంలో అవగాహన
అశ్వాపురం, జూన్ 3, (విజయక్రాంతి): స్వచ్ఛమైన గ్రామ నిర్మాణం లక్ష్యంగా అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ మర్రి సంధ్య ఆధ్వర్యంలో తడి మరియు పొడి చెత్త (ఘన వ్యర్థాల నిర్వహణ)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి సంధ్య మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలంటే ప్రతి కుటుంబం తమ ఇంటి నుంచి వెలువడే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామపంచాయతీ ట్రాక్టర్కు అందించాలని సూచించారు.
చెత్తను వేరు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, గ్రామపంచాయతీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో గ్రామస్తుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చలమల్ల శివకుమార్, వార్డు సభ్యురాలు మూతి రమణి, అంగన్వాడీ టీచర్లు హంసవేణి, సుధ, లత, శైలజ, వీవోఏలు అరుణ, విజయలక్ష్మి, హైమావతి, గ్రామపంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.






