అధికార సభ్యులే సభకు హాజరుకారా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మా ర్చి 17 (విజయక్రాంతి): కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ఆ పార్టీ నేతలే హాజరుకాకపోవడం ముఖ్యమంత్రిపై వారికున్న అపనమ్మకానికి నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దుయ్యబట్టారు. అభివృద్ధి నిధులు రాక గ్రామాల్లో తిరగలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలే తమ ప్రభుత్వంపై లోలోన ఆగ్రహంతో ఉన్నారని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు విధివిధానాలే లేవని, అది కేవలం 9 రోజులకే బోర్లా పడిందని విమర్శించారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయక పోవడంతో మొక్కజొన్న రైతులు క్వింటాలుకు రూ. 700 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక అన్నదాతలు ఆత్మహత్యల వైపు వెళ్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం కేవలం ఫ్యూచర్ సిటీపైనే శ్రద్ధ పెడుతున్నారన్నారు. రైతుబంధు, కరెంటు, సరైన కొనుగోళ్లు లేక వ్యవసాయ రంగం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన వైపరీత్యంలో చిక్కుకుందన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ సీపీ ఆలం గౌస్ తన కుటుంబంతో కలిసి అక్రమంగా ఫైరిం గ్ చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హోం గార్డుల బదిలీల కోసం సీపీ లక్షలాది రూ పాయలు వసూలు చేశారని, ఆయనపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించి సర్వీసు నుంచి తొలగించాలన్నారు. పీసీసీ అధ్యక్షుడికి దమ్ముంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ డ్రగ్స్, మద్యం పరీక్షలు నిర్వహించాలని సవాల్ విసిరారు.




