05-08-2025 01:36:45 PM
న్యూఢిల్లీ: తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో(Supreme Court) మంగళవారం వాదనలు కొనసాగాయి. పదో తరగతి తరవాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నియమ నిబంధనలు రూపొందించాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు ఇచ్చింది. స్థానికత నిర్వచనం, పరిధి, పరిమితులపై మార్గదర్శకాలు ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేసిన కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రెండేళ్లు బయట ప్రాంతంలో చదువుకోవటానికి వెళ్తే తప్పేంటని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. పదేళ్లు స్థానికంగా ఉండి.. రెండేళ్లు బయటికెళ్తే స్థానికత ఎలా కోల్పాతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.