05-08-2025 02:46:23 PM
నల్లగొండటౌన్,(విజయక్రాంతి): ఏఎమ్ ఆర్ పి కాలువల ద్వారా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారబంది పద్దతిలో సాగునీటిని ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) స్పష్టం చేశారు. ఇందుకుగాను తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏ ఎంఆర్పి కాలువల ద్వారా సాగునీరు అందించే విషయమై మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష(Irrigation Department officials) నిర్వహించారు.ఏ ఎం ఆర్ పి కాలువలకు సాగునీరందించే నాలుగు మోటర్లకు గాను ఒక మోటారు రిపేరీలో ఉండటం, మూడవ మోటారు ట్రిప్ కావడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రావడం లేదని, ముఖ్యంగా ఉదయ సముద్రం నుండి 100 క్యూసెక్కుల నీరు తక్కువగా వస్తున్నదని తెలిపారు.
అయితే మోటారు మరమ్మతుకు ఒక రోజు సమయం పట్టే అవకాశం ఉన్నందున సాగు నీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉదయ సముద్రం నుండి 50 క్యూసెక్కుల నీటిని కుషన్ పెంచి విడుదల చేయడం జరుగుతున్నదని ,అదనంగా ఒకరోజు ఇలాగే కొనసాగించాలని చెప్పారు. ప్రస్తుతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందించడం జరుగుతుందని, ప్రస్తుత పరిస్థితులలో చెరువులకు ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇవ్వలేమని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నిర్దేశించిన నాలుగు నెలల సమయం వరకు ఎట్టి పరిస్థితులలో చెరువులను నింపడం జరగదని కలెక్టర్ తెలిపారు. నాలుగు మోటర్లు పూర్తిస్థాయిలో పనిచేసి అనుకున్న మేర సాగునీరు వచ్చిన సమయంలో చెరువులను నింపడం జరుగుతుందని స్పష్టం చేశారు.
నాలుగో మోటారు మరమ్మతు తర్వాత బుధవారం నుండి పనిచేస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. నాలుగు మోటర్లు పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వాత ముందే నిర్దేశించిన ప్రకారం ఆయా డిస్ట్రిబ్యూటరీల ద్వారా నిరంతరం సాగు నీటిని ఎలాంటి అవరోధం లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కాగా ఏ ఎం ఆర్ పి హెచ్ ఎల్ సి,ఎల్ ఎల్ సి ల ద్వారా సాగు నీరు అందించేందుకు షెడ్యూల్ రూపొందించడం జరిగిందని, గత నెల 28 నుండి నవంబర్ 24 వరకు కాలువల ద్వారా సాగునీటిని ఇచ్చేలా షెడ్యూల్ రూపొందించినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నెహ్రు నాయక్, ప్రభు కళ్యాణ్, డిప్యూటీ ఇంజనీర్ ఆంజనేయస్వామి, తదితరులు ఉన్నారు.