వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అరెస్టులు
బీఆర్ఎస్ ముషీరాబాద్ నేతలు
ముషీరాబాద్,ఆగస్టు 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ ముషీరాబాద్ సీనియర్ నాయకులు డి. శివముదిరాజ్, టి. సోమన్ లు ఆరోపించారు. బుధవారం ముషీరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించేందుకు బయల్దేరిన బీఆర్ఎస్ అగ్రనేతలను హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని వారు పేర్కొన్నారు.
ప్రశ్నించే ప్రతిపక్షాల నేతల కొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిమ్స్ ఆసుపత్రిలో కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం దారుణం అని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆరు నెలలకొక ఆసుపత్రిని ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు.
టిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహించే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నేతలను అన్ని విధాలుగా వేధింపులకు గురిచేయడంతో పాటు అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ కు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు టెంట్ హౌస్ శ్రీనివాస్, డివిజన్ ఉపాధ్యక్షులు బల్ల ప్రశాంత్, ఎండి. మోహిన్ తదితరులు పాల్గొన్నారు.






