09-11-2025 01:41:07 AM
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 08 (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్ విభాగ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతిఒక్కరూ అంకితభావం, క్రమశిక్షణతో తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
శనివారం పేట్లబురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన సెరిమోనియల్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగానికి మంచి పేరుందని, సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తుండటం అభినందనీయమని కొనియాడారు.
ఈ పరేడ్ లో సిటీ సెక్యూరిటీ గార్డు, స్వాఫ్ట్, క్విక్ రియాక్షన్ టీమ్ క్యూఆర్టీ, సిటీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(సీఆర్ఏఎఫ్) వంటి విభాగాలకు చెందిన 1,044 మంది సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ ఉద్యోగం ఇతర వృత్తులతో పోలిస్తే ఎంతో భిన్నమైనదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యతనిస్తూనే, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హితవు పలికారు.
పరేడ్ అనంతరం, సీపీ సజ్జనార్ ఏఆర్ సిబ్బందితో నేరుగా మాట్లా డి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తన దృష్టికి తెచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలోని శిశు సంరక్షణ కేంద్రం, ఆయుధాగారం ఆర్మ్స్ అండ్ అమ్మునిషన్ స్టోర్ రూమ్, ఆయుధాల వర్క్షాప్, బ్యారక్స్ వంటి అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమా వేశం నిర్వహించి, మెరుగైన పోలీసింగ్ కోసం దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీలు ఎన్.భాస్కర్, బి.కిష్టయ్య, టి.కరుణాకర్, డి.సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.