ఖమ్మంలో బాలికపై అమానుషం
- నిందితుడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్
ఖమ్మం, జూన్ 9 (విజయక్రాంతి): ఖమ్మం రాపర్తి నగర్లోని జీ ప్రైడ్ అపార్ట్మెంట్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ అత్యాచారం, హత్యాయత్నం ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పరామర్శిం చారు. ఈ హృదయ విదారక ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అపార్ట్మెంట్లో రెండో అంతస్తులో నివాసం ఉంటున్న 42 ఏళ్ల మహ్మద్ గౌస్ పాషా అనే మృగాడు 12 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. బాలిక ప్రతిఘటించడంతో కిరాతకంగా అపార్ట్మెంట్ పైనుంచి కిందకు తోసేశాడని, దీంతో ఆ పసిపాప రెండు చేతులు, వెన్నెముక విరిగిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేవలం పోక్సో కేసు మాత్రమే నమోదు చేసి, అతనికి రక్షణ కల్పిస్తున్నారని కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. నెల్లూరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు నకరికంటి వీరభద్రం, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పమ్మి అనిత, మంద సరస్వతి, శ్రీరామనని మణి, పని కుమారి, నాగమణి, స్వర్ణ, మీడియా కన్వీనర్ నెల్లూరి బెనర్జీ, జిల్లా కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, నలమాస్ శ్రీను, శాసనాల సాయిరాం, వాకగాని రామకృష్ణ, గోనెల శివ తదితరులు ఉన్నారు.






