ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి
- టమాటాలు, కోడిగుడ్లు విసిరిన యూత్ కాంగ్రెస్ నేతలు
- కౌశిక్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
- ఎమ్మెల్యే కడియంపై వ్యాఖ్యలను వెనక్కి తీసకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్
హుజురాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ సమీపంలో కౌశిక్రెడ్డి ఇంటిని యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం ముట్టడించారు. ఇంటిపైకి కోడిగుడ్లు, టమోటాలను విసిరుతూ ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఐ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశంలో దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యేను హుజూరాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వబోమని, ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వం రద్దు చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వార్తల్లో నిలవాలని ముఖ్యమంత్రి, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్, శనిగరపు తరుణ్, విష్ణువర్ధన్, రాజు, ఎండి సాదిక్, జన్ను ప్రసాద్, బన్నీతో పాటు తదితరులు పాల్గొన్నారు.




