అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరికలు

23-04-2024 12:21:11 AM

l ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని.. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరం కలిసి పనిచేసి ఎంపీ ఎన్నికల్లో మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పార్టీ గోపాల్‌పేట మండల నాయకులు సత్యశీలారెడ్డి, అచ్యుత రామారావు ఆధ్వర్యంలో జంప్లతండా, బుద్దారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీదేవివిష్ణు, పలువురు మాజీ సర్పంచులు సహా 150 మంది బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే మేఘారెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. బుద్దారం రిజర్వాయర్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కమీషన్లు వచ్చే పనులపైనే దృష్టి సారించారు తప్ప గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలివేశారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు పర్వతాలు, నాయకులు పాల్గొన్నారు.