16-10-2025 12:00:00 AM
ప్రణాళికాబద్ధంగా వరి కోతలు జరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రులు.
ములుగు, అక్టోబరు 15 (విజయక్రాంతి) : ములుగు జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశ చరిత్రలో అత్యధికంగా వరి పంట సాగు విస్తీర్ణం ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని అన్నారు.
రాబోయే వానా కాలం అత్యధికంగా పంట కొనుగోలు తెలంగాణ రాష్ట్రం చేయబోతుందని, దీనికి అవసరమైన ఏర్పాట్లు కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధతో చేపట్టాలని అన్నారు. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ధాన్యం రవాణా కాంట్రాక్ట్ ఖరారు చేసే ముందు సరిపడ వాహనాలు సరఫరా చేసేందుకు అర్హత ఉందో లేదో ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని మంత్రి సూచించారు.
జిల్లాలో వరి కోతలు ప్రణాళికాబద్ధంగా జరిగేలా కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ప్రారంభించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు, గన్నిబ్యాగులు, వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని, కొనుగోలు సిబ్బందికి అవసరమైన మేర శిక్షణ అందించాలని అన్నారు.