22-02-2026 12:18:26 PM
సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆశయాలు కొనసాగిద్దాం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): యువత సేవాలాల్ మహారాజ్ జీవితంతో స్ఫూర్తి పొంది ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ నగరంలోని అయ్యప్ప కొండ, పద్మావతి కాలనీలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ గిరిజన, బంజారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారన్నారు.
సమాజంలో నైతిక విలువలు, సేవాభావం, ఐక్యత, సామరస్యం, ధర్మబద్ధత వంటి సద్గుణాలను పెంపొందించడానికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, సామాజిక సమానత్వం వంటి అంశాలు సేవాలాల్ మహారాజ్ ఆశయాల్లో కీలకమని, ఆ దిశగా ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ జి. మమత శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్లు సువర్ణ కిషన్ నాయక్, దేవ్లీ మేగ్యా నాయక్, సీబీ శ్రీపూజిత, నాయకులు కె. శేఖర్ నాయక్, ఆర్. శేఖర్ నాయక్, అంతిరాం నాయక్, ప్రతాప్, తిరుపతి నాయక్, రఘురామిరెడ్డి, ఆనంద్ కుమార్, అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.