14-07-2025 01:46:08 AM
-మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
ముషీరాబాద్, జూలై 13 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తున్నారని, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు. కేసీఆర్ దుష్ప్రచారాలు మానుకో కపోతే ప్రజలే తగిన బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో అఖిల భారత బంజారా మహా సేవా సంఘ్ అధ్యక్షులు జగన్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ కవిత, కేటీఆర్ ల మధ్య గొడవ ప్రజలకు ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష నేత హోదాలో జీత భత్యాలు తీసుకుంటున్నాడన్నారు.
కేసీఆర్ కు అధికారం పోయిన గర్వం తగ్గలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో లోపాలు ఉంటే ఎత్తిచూపాలి తప్ప, మీడియా మీద దాడి చేయడం అవివేకమన్నారు. ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, డ్వాక్రా మహిళా రుణాలు మాఫీ, రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ, సన్న బియ్యం, అంగన్వాడీలకు గౌరవ వేతనం, నిరుద్యోగులకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చారని, ఈలాం టి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తుందన్నారు.
బీసీల ఆత్మగౌరవం 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. కేసీఆర్ కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకున్నారని, ప్రకటనల పేరుతో 244 కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతానని కళలు కంటున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, తెలంగాణను నట్టేట ముంచి అప్పుల ఉబిలోకి నెట్టారని ఆరోపించారు. ఈ సమావేశంలో బంజారా సంఘ్ నేతలు జంగయ్య, దుర్గయ్య పాల్గొన్నారు.