06-04-2025 12:00:00 AM
మురికికాలువల సమీపాన బతుకులు ఈడుస్తున్న బడుగుజీవుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అత్యంత ప్రమాదక విష రసాయనాల కారణంగా వారి జీవితాలు క్యాన్సర్ ముప్పు బారిన పడబోతున్నట్టు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసర్చి) అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. మురికికాల్వల పక్కన నివసించడం పేదవారికి సర్వసాధారణమైంది. ప్రభుత్వాలు అలాంటి వారిని గుర్తించి, తగు రక్షణ కల్పించాలి.
వేరే సురక్షితమైన ప్రాంతాలలో వారికి నివాసం కల్పించాలి. పరిమితులకు మించి మురికినీటిలో ఉన్న విషపూరిత సీసం, అల్యూమినియం, ఐరన్ వంటి లోహాలవల్ల పరిసరాలలో క్యాన్సర్ సంభావ్యత అధికంగా పెరగడం సాధారణమని నిపుణులు అంటున్నారు. నదుల కాలుష్యాలు, డ్రైనేజీ కాలువలు అభాగ్యుల పాలిట శాపాలుగా మారకుండా రాజకీయ నాయకులు తగు చర్యలు చేపట్టాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత మేరకు సురక్షిత నీటిని తాగడం/ వాడడం చేయాలి. మురికినీటికి దూరంగా ఉండాలి. ఆంటీ-ఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉన్నంతలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- డా. బుర్ర మధుసూదన్రెడ్డి, కరీంనగర్