calender_icon.png 25 June, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ చుట్టే రాజకీయం!

06-04-2025 12:00:00 AM

దేశ వ్యాప్తంగా వక్ఫ్‌బోర్డుల పరిధిలో సుమారు 9.4లక్షల ఎకరాల భూమి ఉంది. దీని విలువ సుమారు 1.2లక్షల కోట్లు ఉన్నట్టు అంచనా. రక్షణశాఖ, భారతీయ రైల్వే తర్వాత వక్ఫ్‌బోర్డుల పరిధిలోనే అం త పెద్ద మొత్తంలో భూమి ఉంది. వక్ఫ్‌చట్టం-1995లోని లొసుగుల వల్ల కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు వక్ఫ్ బోర్డుల పరిధిలోకి వెళ్లాయి. వక్ఫ్ బోర్డుల పరిధిలోని ఆస్తులు అల్లాకు చెందిన ఆస్తులుగా ముస్లింలు విశ్వసిస్తారు.

అందువల్ల ఆ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం లేదు. ఈ తరుణంలో వక్ఫ్‌బోర్డుల తీరుపట్ల హిందువుల్లో క్రమంగా అసంతృప్తి మొదలైంది. వక్ఫ్ చట్టంలోని లొసుగులను వాడుకుని కొందరు అక్రమాలకు పాల్పడటం కూడా హిందువుల్లో నెలకొన్న అసంతృప్తిని మరింత పెంచింది. ముందు నుంచీ వక్ఫ్‌బోర్డుల తీరును వ్యతిరేకిస్తున్న బీజేపీ వక్ఫ్ చట్టాన్ని ప్రక్షాళించేందుకు పూనుకుంది.

వక్ఫ్‌బోర్డును క్రమబద్దీకరించడంతోపాటు సంస్కర ణల ద్వారా జవాబుదారీతనాన్ని తీసుకొస్తామంటూ వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం మాత్రమే తరువాయి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి నెలకొంది.

వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా మేలు జరుగుతుం దని బీజేపీ ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ వక్ఫ్ బోర్డులపై నియంత్రణ కోసమే మోదీ ప్రభత్వం ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుందనే విషయం నిశితంగా పరిశీలిస్తే అవగతం అవుతుంది. ముస్లిం విద్యార్థుల స్కాలర్షిప్‌లను ఇదే ప్రభుత్వం ఎత్తేసింది.

హిందూ మహిళల మెడల్లోని మంగళసూత్రాలను ముస్లింలు తెంచేస్తారంటూ ఇదే ప్రభుత్వంలోని పెద్దలు గతంలో వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అం తలా ఆ వర్గాన్ని ద్వేషించే ఈ ప్రభుత్వ పెద్దలు వక్ఫ్‌బోర్డులపై పట్టు సాధించడానికే నేడు ముస్లింల ప్రయోజనాలంటూ మాట్లాడుతున్నారనే వాదన వినిపిస్తోంది.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లును తొలి నుంచి కాంగ్రెస్, ఎంఐఎం సహా ఇతర విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26ను బీజేపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆక్షేపి స్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావెద్, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వక్ఫ్ సరవణ బిల్లును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.

మరోవైపు మోదీ ప్రభుత్వంలో మిత్ర పక్షంగా ఉన్న జేడీయూలో ఈ బిల్లు అసంతృప్తి జ్వాలలను రేకెత్తించింది. బిల్లుకు జేడీయూ మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ ఐదుగురు సీనియర్ నేతలు ఆ పార్టీని వీడారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వచ్చే ఏడాది అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో వక్ఫ్ సవరణ బిల్లు కేంద్రంగా రాజకీయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడులో కేవలం 5శాతమే ముస్లిం జనాభా ఉన్నప్పటికీ అస్సాంలో 34%, బెంగాల్‌లో 27%, కేరళలో 26%, బీహార్‌లో 17% ముస్లింలు ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లన్నీ తమకే పడేలా ప్రతిపక్షాలు వ్యూహాలు రచించే అవకాశం ఉండగా హిందువుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై బీజేపీ దృష్టిపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.