calender_icon.png 25 June, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనవసర ఆర్థిక భారం తగ్గించండి

06-04-2025 12:00:00 AM

సామాన్య ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రభుత్వ విధానాలు అన్ని సేవలకు ఖర్చును విధించే దిశగా కొనసాగుతున్నాయి. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వాలకు, నాయకులకు అంత శ్రేయస్కరం కాదు. ఉచితంగా లభిస్తున్న ఏటీఎం లావాదేవీలపై ఇప్పుడు అదనపు ఛార్జీలు విధించనున్నారు. ఇలాంటివి ఇంకెన్నో. దీనికితోడు ఏప్రిల్ నుండి రహదారులపై టోల్ చార్జీలు కూడా పెరగగలవని అంటున్నారు.

తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న సేవలు క్రమక్రమంగా సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. టోల్ చార్జీల విషయంలో, రహదారి నిర్మాణ ఖర్చు పూర్తిగా వసూలైన తరువాత కూడా వసూళ్లు కొనసాగుతుండడం దారుణం. ఫాస్ట్ టాగ్ వంటి ఆటోమేటిక్ విధానాలవల్ల ప్రజలు లేనిపోని దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి అన్యాయమైన విధానాలను ప్రభుత్వాలు ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నాయో తెలియడం లేదు.

నిర్మాణ వ్యయం పూర్తయిన తరువాత టోల్ వసూలు కొనసాగించడాన్ని తక్షణమే నిలిపివేయాలి. టోల్ బూత్‌లు ప్రయాణికులను అడ్డుకుంటుండడంతో మరోవైపు ట్రాఫిక్ కూడా పెరుగుతోంది. సామాన్యులకు ప్రయాణ ఖర్చులు సైతం అనవసరంగా తడిసి మోపెడవుతున్నాయి.

ప్రభుత్వం నిరంతరం ప్రజలనుంచి డబ్బు వసూలు చేస్తూ మోసం చేయకుండా పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రజలు దీన్ని సహజంగా అంగీకరించకుండా, తమ హక్కులకోసం నిరసనల గళం విప్పాలి. లేకపోతే, కాలక్రమేణా ఈ విధమైన వసూళ్లు అంతులేని భారంగా మారిపోతాయి. 

 డా. కృష్ణకుమార్ వేపకొమ్మ, హైదరాబాద్