రోడ్డు భద్రతలపై అవగాహన
బీబీపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల బస్టాండ్ పరిసర ప్రాంతంలో మంగళవారం స్థానిక ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆ వాహనంకు సంబంధించిన ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు వెంటబెట్టుకొని ప్రయాణం కొనసాగించాలి. డ్రైవింగ్ చేస్తున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, వాహనదారులు ఎట్టి పరిస్థితిలో మద్యం సేవించి వాహనాన్ని నడపకూడదని, ఆటోలు కార్లు భారీ వాహనాలు సరియైన ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.
18 ఏళ్ల లోపు వయసుగల బాల బాలికలు వాహనాలను నడపకూడదని అలా నడిపిన యెడల తల్లిదండ్రులకు వాహన యజమానులకు భారీ మొత్తంలో జరిమానా విధించాల్సి వస్తుందని ఆయన సూచించారు. అంతేకాకుండా సంక్రాంతి పండగ సందర్భంగా ఎగురవేస్తున్న గాలిపటాలకు చైనా దారాలు, మాంజా వంటి వాటిని కట్టి ఎగురవేయకూడదని అలా ఎగరవేసిన యెడల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరైనా అలాంటి దారాలతో గాలిపటాలను ఎగరవేయడం, ఎవరైనా పండగ సందర్భంగా జూదాలు, కోడి పందాలు వంటిని ప్రోత్సహించకూడదని గుట్టుగా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షకు గురి అవుతారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది రవీందర్, స్థానిక ప్రజలు తదితరులున్నారు.




