కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నాల రైతు వేదికలో రైతులకు పంటల విభిన్నీకరణపై అవగాహన కల్పించారు. బెల్లంపల్లి కేవీకే (KVK) ఆధ్వర్యంలో మంగళవారం అవహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేవికే ప్రోగ్రామ్ సమన్వయకర్త డా. ఎం. ప్రసూన పాల్గొని రైతులకు పంటల మార్పిడి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఒకే పంటపై ఆధారపడకుండా, వాతావరణ మార్పులు మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పలు పంటలను సాగు చేయడంతో రైతులు లాభాలను పెంచుకోవచ్చని తెలిపారు.
శాస్త్రవేత్త డా. ఎన్. మహేష్ జిల్లాలో పంటల మార్పిడి కి అనువైన ప్రత్యామ్నాయ పంటలు, వాటి సాగు పద్ధతుల (ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్) గురించి రైతులకు సమగ్రంగా వివరించారు. డా. యు. శ్రావంతి ఆయిల్ పామ్ సాగులో అనుసరించాల్సిన నిర్వహణ పద్ధతులను వివరించి, రైతులు ఈ పంట ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ప్రేమ్ కుమార్, ఫర్హీన్, ఉద్యానవన శాఖ అధికారి అర్చన, వ్యవసాయ విస్తరణ అధికారి తిరుపతి పాల్గొన్నారు.




