17-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి
నిర్మల్, అక్టోబర్ 1౬ (విజయక్రాంతి): జిల్లాలో పోషణ మాసం ముగింపు వేడుకలు గురువారం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. మాతా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన పోషణ మాసం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు. ఇది ఒక్క నెల కార్యక్రమంగా కాకుండా, ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారం అందుతోందని భరోసా కల్పించాలని అన్నారు.
ప్రతి చిన్నారి అంగన్వాడీలో చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 17వ తేదీ నుంచి నేటివరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాల నివారణపై విస్తృత అవగాహన కల్పించామన్నారు.
జిల్లాలోని 931 అంగన్వాడీల్లో ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన సం పూర్ణ ఆహారం అందిస్తోందని, వైద్యారోగ్య శాఖ సహకారంతో గర్భిణీ స్త్రీలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. అంగన్వాడీ టీచర్లు పిల్లలను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, బాల్యంలో పోషకాహార లోపం అధిగమిస్తే భవిష్యత్తులో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి, దేశ నిర్మాణానికి తోడ్పడతారని తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, జిల్లాలోని అంగన్వాడీల్లో వందశాతం పిల్లలకు పోషకాహారం అందుతోందని, శాఖకు సంబంధించిన సూచికల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. భవిష్యత్తులో అన్ని సూచికల్లో మెరుగైన స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పోషకాహారంపై నాటికలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలకు పండ్లు, సారెలు పంపిణీ చేసి సామూహిక సీమంతం నిర్వహించగా, చిన్నారులకు అన్నప్రాసన జరిపారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు పోషకాహార స్టాళ్లను పరిశీలించి, టీచర్ల సృజనాత్మకతను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, డిఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సీడీపీవోలు, సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు.